Gold Missing from CBI Custody: సీబీఐ వద్ద నుంచి 103 కిలోల బంగారం మాయం, మద్రాస్ హైకోర్టులో ఫిర్యాదు చేసిన బ్యాంకులు, విచారణ చేపట్టాలని తమిళనాడు పోలీసులను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు
తమిళనాడులో సీబీఐకి వింత అనుభవం ఎదురైంది. 2012 నాటి కేసులో సీబీఐ వద్ద ఉన్న 103 కిలోల బంగారం మిస్సైనట్లు (Gold Missing from CBI Custody) హైకోర్టులో సీబీఐ మీద ఫిర్యాదు నమోదు అయ్యింది.
Chennai, Dec 12: తమిళనాడులో సీబీఐకి వింత అనుభవం ఎదురైంది. 2012 నాటి కేసులో సీబీఐ వద్ద ఉన్న 103 కిలోల బంగారం మిస్సైనట్లు (Gold Missing from CBI Custody) హైకోర్టులో సీబీఐ మీద ఫిర్యాదు నమోదు అయ్యింది. 2012లో ఓ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 400.47 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కెట్లు, ఆభరణాల రూపంలో ఉంది. అయితే సురాణా కంపెనీ అప్పటికే పలు బ్యాంకులకు వందల కోట్లలో బకాయిలు పడటంతో..బ్యాంకులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి.
ఎస్బీఐకే ఆ సంస్థ దాదాపు రూ.1,160 కోట్లు బాకీ పడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇతర బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్దకు చేరగా, ఆ బంగారాన్ని బ్యాంకులకు స్వాధీనం చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.దాంతో సీబీఐ తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులకు అప్పగించేందుకు తూకం వేసింది. ఇందులో 103 కిలోల మేర తగ్గుదల (103 kg gold missing from CBI custody) కనిపించింది. ఒక్కసారిగా అంత బంగారం ఎలా తగ్గిందో అర్థంకాక సీబీఐ అధికారులు తలలు పట్టుకున్నారు.
ఈ విషయం మద్రాస్ హైకోర్టుకు (Madras High Court) చేరగా తమకే పాపం తెలియదని కోర్టుకు సీబీఐ మొరపెట్టుకుంది. ఒక్కసారిగా 100 కిలోలకు పైగా ఎలా తగ్గుతుందని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. స్వాధీనం చేసుకున్న సమయంలో బంగారు గొలుసులు, బిస్కెట్లు అన్నీ కలిపి తూకం వేశామని, ఇప్పుడు విడివిడిగా తూకం వేశామని, అందుకే తగ్గి ఉండొచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.ఈ వాదనలో ఏకీభవించిన ధర్మాసనం ఈ కేసును తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టాలని తాజాగా మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
దీంతో సీబీఐ ప్రతిష్టకు మచ్చ పడినట్లు అయ్యింది. స్థానిక పోలీసులు తమల్ని విచారిస్తే, తమ ప్రతిష్ట దెబ్బతింటుందని సీబీఐ వాదించినా.. మద్రాసు హైకోర్టు పట్టించుకోలేదు. సీబీఐకి ఇది అగ్నిపరీక్షే కావొచ్చు కానీ, సీతలాగ స్వచ్ఛమైతే, మీరు మరింత స్వచ్ఛంగా బయటపడుతారని, ఒకవేళ అలా కాకపోతే పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి పీఎన్ ప్రకాశ్ తెలిపారు. సురనా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సీజ్ చేసిన 400 కేజీల బంగారం నుంచి 103 కిలోల బంగారం అదృశ్యమైంది. 43 కోట్ల విలువైన ఆ బంగారం ఆచూకీ చెప్పడంలో సీబీఐ విఫలమైంది. దీంతో స్థానిక పోలీసులు ఆ కేసును విచారించాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ అధికారులం అయ్యుండి, ఇప్పుడు స్థానిక పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితిని సీబీఐ అధికారులు జీర్ణించుకోలేకపోయారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని కోర్టుకు విన్నవించుకోగా, కోర్టు వారి విజ్ఞాపనను తోసిపుచ్చింది. మాయమైన బంగారం వ్యవహారాన్ని ఆర్నెల్లలో తేల్చేయాలంటూ స్థానిక పోలీసులకు విచారణ అధికారాలు ఇచ్చింది.
(The above story first appeared on LatestLY on Dec 12, 2020 03:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

