Noida Horror: నిర్భయ ఘటన తలపించేలా నోయిడాలో దారుణం.. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితులు అరెస్ట్..
డిసెంబర్ 2012 నాటి దారుణ నిర్భయ ఘటనను తలపించేలా ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగు చూసింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై బస్సు డ్రైవర్, కండక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
Noida Horror: డిసెంబర్ 2012 నాటి దారుణ నిర్భయ ఘటనను తలపించేలా ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగు చూసింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై బస్సు డ్రైవర్, కండక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల ప్రారంభంలో (ఆగస్టు 4న) జరిగిన ఈ దారుణానికి సంబంధించి, ఉత్తర ఢిల్లీలోని తిమర్పూర్ పరిధిలోని ఒక పార్కింగ్ స్థలంలో 39 ఏళ్ల బస్సు డ్రైవర్ కుల్దీప్, 26 ఏళ్ల కండక్టర్ సందీప్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ‘విశ్వనాథ్ ట్రావెల్స్’ అనే ప్రైవేట్ రవాణా సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. చదువు విషయంలో తల్లి కోప్పడటంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉత్తర ప్రదేశ్లోని మైన్పురి నుంచి నోయిడాలో ఉన్న తన కజిన్ ఇంటికి బయలుదేరింది. ఆగస్టు 4 రాత్రి 9 గంటల సమయంలో, భారీ వర్షంలో తడుస్తూ గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద దిగిన ఆమెకు, తాను చేరుకోవాల్సిన నోయిడా సెక్టార్ 63కి మరో 25 కిలోమీటర్ల దూరం ఉందనే విషయం తెలిసింది. చీకటి, వర్షం కారణంగా ప్రయాణ సాధనం కోసం ఎదురుచూస్తుండగా ప్రయాణికులెవరూ లేని ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఆమె వద్ద ఆగింది. తాము సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని కండక్టర్ చెప్పడంతో నమ్మి ఆ బాలిక బస్సు ఎక్కింది. అయితే, ఆ బస్సు వాస్తవానికి సూరజ్పూర్లోని ఒక వర్క్షాప్ నుంచి వస్తోందని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
బస్సు కదలడం ప్రారంభించిన వెంటనే డ్రైవర్, కండక్టర్లు బాలికపై అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె గట్టిగా కేకలు వేసి ప్రతిఘటించగా, బయటకు చెబితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దారుణం అనంతరం నిందితులు ఆమెను ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద రింగ్ రోడ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు జరిపి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.