Pratapgarh Viral Video: మేకల గుంపుపైకి దూసుకెళ్లిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్.. మహిళలకు తృటిలో తప్పిన ప్రమాదం..వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో బుధవారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్-లక్నో రైల్వే లైన్పై వేగంగా వచ్చిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు డజన్ల కొద్దీ మేకలను ఢీకొట్టడంతో 35 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.
Pratapgarh Viral Video: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో బుధవారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్-లక్నో రైల్వే లైన్పై వేగంగా వచ్చిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు డజన్ల కొద్దీ మేకలను ఢీకొట్టడంతో 35 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. అయితే, అదే సమయంలో పట్టాలు దాటుతున్న పలువురు మహిళలు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడటంతో పెద్ద పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ సంఘటన హతిగవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిదిర్పూర్ సమీపంలో ఉన్న కృష్ణ రామ్ కా పూర్వా ప్రాంతంలో ఉదయం సుమారు 10:00 గంటలకు జరిగింది. లక్నో-ప్రయాగరాజ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైల్వే క్రాసింగ్ గుండా పూర్తి వేగంతో వెళుతున్న సమయంలో, స్థానిక మహిళలు తమ మేకల మందను మేపుకుంటూ పట్టాలు దాటించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఊహించని విధంగా మేకల మంద ఒక్కసారిగా పట్టాలపైకి రావడం, రైలు అధిక వేగంతో సమీపించడంతో డ్రైవర్ రైలును ఆపే అవకాశం లేకుండా పోయింది.
Intercity Express Hits Goats:
రైలు బలంగా ఢీకొనడంతో దాదాపు 30 నుండి 35 మేకలు అక్కడికక్కడే మరణించాయి. మేకలను తోలుకెళ్తున్న మహిళలు రైలు వేగాన్ని గమనించి చివరి క్షణంలో పక్కకు తప్పుకోవడంతో వారికి తీవ్ర గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలపై ఉన్న వ్యర్థాలను తొలగించి, మార్గాన్ని సురక్షితం చేసిన అనంతరం అధికారులు రైలును ప్రయాణానికి అనుమతించారు. తమ జీవనాధారమైన పశువులను ఒకేసారి కోల్పోవడంతో స్థానిక పశువుల యజమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.