SC on Students Protest: దేశవ్యాప్తంగా విద్యార్థులపై FIRలు ఇక ఉండవు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. జూలై 20-25 నిరసనల కేసులు క్లోజ్.. సెప్టెంబర్ 5 ర్యాలీ రద్దు చేసుకున్న సీజేపీ..
ఒకవైపు నిరసనలకు సంబంధించిన కేసులను రద్దు చేయడం, మరోవైపు తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు సమతుల్య వైఖరిని అవలంబించినట్లు కనిపిస్తోంది. తాజా ఆదేశాలతో CJP నిరసనలకు తాత్కాలికంగా తెరపడినట్టయింది.
SC on Students Protest: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనకారులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జూలై 20 నుంచి 25 వరకు జరిగిన ఆందోళనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా, జూలై 20–25 మధ్య జరిగిన నిరసనల ఆధారంగా CJP కార్యకర్తలు, విద్యార్థులపై దేశంలో ఎక్కడా కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని పోలీసులను ఆదేశించింది.
అయితే, ఇప్పటికే తీవ్రమైన నేరచరిత్ర ఉన్న 2,873 మందిపై చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. అంటే నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పూర్తి మినహాయింపు ఇవ్వకుండా, తీవ్రమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని మాత్రం చట్టపరమైన విచారణ పరిధిలో ఉంచింది.
ఆందోళనల సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం అందించేలా సమగ్ర విధివిధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు రూపొందించిన మూడు నెలల్లోగా పరిహారం పూర్తిగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలనే షరతుతోనే కేసులను రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇదే విధానం, షరతులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించవచ్చని తెలిపింది.
ఢిల్లీ, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే కేసుల రద్దు కోసం దరఖాస్తులు దాఖలు చేశారు. పరస్పర నమ్మకంతో ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకోవడం సానుకూల పరిణామమని సీజేఐ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో CJP కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తాము గతంలో ప్రకటించిన సెప్టెంబర్ 5 ర్యాలీని రద్దు చేస్తున్నట్లు పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సుప్రీంకోర్టు కల్పించిన న్యాయపరమైన రక్షణ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులను ఎప్పటికీ ప్రత్యర్థులుగా ప్రభుత్వం చూడదని సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు.