Nandigram 'Attack': మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల, వీల్ఛైర్లోనే ప్రచారం చేస్తానని తెలిపిన దీదీ, కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని పిలుపు, దాడిపై రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన ఈసీ
పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి (Nandigram Attack) జరిగిందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి.
Kolkata, March 11: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి (Nandigram Attack) జరిగిందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. నందిగ్రామ్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్ వేశారు. అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి (Mamata Banerjee attacked) చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు.
సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో (West Bengal Assembly Elections 2021) పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు దాడి చేశారని ఆమె తెలిపారు. ఆ వ్యక్తుల దాడి వల్ల తన కాలికి గాయమైనట్లు పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జరిగినట్టు చెబుతున్న దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో.. నిన్న రాత్రి నుంచి ఆమె ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలయ్యింది. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు పడుతున్నట్లు డాక్లర్లు తెలిపారు. ఆమె ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 48 గంటలపాటు మమతా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు.
దాడికి నిరసనగా టీఎంసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇక మమతపై దాడి నేపథ్యంలో ఇవాళ ప్రకటించాల్సిన మేనిఫెస్టో వాయిదా పడింది. మమత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలిసారే. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న ఈసీ..రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు.
Here's Video
দলনেত্রীর @MamataOfficial আবেদন pic.twitter.com/SPoD3m7Iu3
— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021
ఈ పరిస్థితుల మధ్య దీదీ తాజాగా ఓ వీడియోను (Mamata Banerjee Releases Video) బయటకు విడుదల చేశారు. వీల్ఛైర్లో ప్రచారంలో పాల్గొంటానని, కొన్ని రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అవుతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచే గురువారం అభిమానులనుద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. దాడి జరిగిన తర్వాత మమత స్పందించడం ఇదే ప్రథమం. దాడి సందర్భంగా చాలా గాయాలయ్యాయని, చేతులు, కాళ్లు తీవ్రంగా నొప్పి పెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
‘‘చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఛాతీలో నొప్పి కూడా ఉంది. ప్రజలకు అభివాదం చేస్తున్న సందర్భంగా నా కాలు కారు డోరులో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లోగా బయటకు వచ్చేస్తా. కాలుకు బాగా దెబ్బతగిలింది. అయినా.... కష్టపడతా. నా షెడ్యూల్ యథావిథిగానే ఉంటుంది. మార్పేమీ ఉండదు. వీల్చైర్లోనే ప్రచారం చేస్తా. మీ మద్దతు నాకు కావాలి. అందరూ శాంతియుతంగానే ఉండండి. సంయమనం పాటించండి. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ పనీ చేయకండి.’’ అంటూ సీఎం మమత ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీని ఇవాళ ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. నుస్రత్ జహాన్ రూహీ, మిమి చక్రవర్తి, మదన్ మిత్రా తదితరులు కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి వెళ్లి మమతను కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నందిగ్రామ్లో సీఎం మమత నామినేషన్ వేశారు. మరోవైపు ఇవాళ ఉదయం మమతా బెనర్జీని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేతలకు ఆస్పత్రి వైద్యులు అనుమతి నిరాకరించారు. బీజేపీ నేతలు ఆస్పత్రి ప్రాంగణంలోకి వెళ్లగానే తృణమూల్ కార్యకర్తలు ‘గోబ్యాక్... గోబ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో మమతను కలుసుకోకుండానే బీజేపీ నేతలు ఆస్పత్రి నుంచి వెనక్కి వచ్చేశారు.
సీఎం మమతాపై జరిగిన దాడిని టీఎంసీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా మమత నందిగ్రామ్లోనే ఉన్నారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది.
మరోవైపు మమతా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఖండించారు. మమతా దాడి పేరుతో సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు విమర్శించారు. చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్ఘియ డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అన్నారు.ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పరామర్శించారు. ఆయన ఆసుపత్రిలోకి వెళ్తుండగా, ‘గో బ్యాక్’ అంటూ టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగుతున్న ఒకప్పుడు ఆమెకి అత్యంత సన్నిహితుడు, నందిగ్రామ్లో బాగా పట్టున్న నేత సువేందు అధికారితో ఆమె తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల సేకరణకి వ్యతిరేకంగా ఉద్యమించిన తాను నందిగ్రామ్ నుంచి ఎప్పుడూ వట్టి చేతులతో వెళ్లలేదని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి వెంట రాగా మమత 2.కిలోమీటర్ల మేర రోడ్డు షో నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం హల్దియా సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ‘‘నందిగ్రామ్ నుంచి నా గెలుపు ఖాయం. ఇక్కడి నుంచి సులభంగా నేను విజయం సాధించగలను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో నేత ఎవరూ లేకుండా నియోజకవర్గం ఉంది. అప్పుడు సాధారణ ప్రజల ముఖాలు చూసి నేను ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని దీదీ విలేకరులకు చెప్పారు.
నందిగ్రామ్ అన్నది ఒక పేరు కాదు. ఒక ఉద్యమ బావుటా అని మమతా బెనర్జీ ప్రశంసించారు. ‘‘ నేను అందరి పేర్లు మర్చిపోతానేమో, కానీ నందిగ్రామ్ పేరును ఎప్పటికీ మర్చిపోను. ఈ ప్రాంతానికి నేనిచ్చే ప్రాధాన్యత అలాంటిది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తను ఎప్పుడూ ఇక్కడ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరగలేదని, తన గెలుపు ఇక్కడ ఖాయమన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఎవరూ విడగొట్టలేరని అన్నారు. నందిగ్రామ్ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా పాల్గొన్నాయని ఆమె గుర్తు చేశారు.
ఇన్నాళ్లూ భవానీపూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ చేసిన సవాల్తో కేవలం నందిగ్రామ్ నుంచి మాత్రమే పోటీకి దిగారు. ఒక అద్దె ఇంట్లో ఉంటూ తన ప్రచారాన్ని సాగించనున్నారు. మరోవైపు బీజేపీ అ«భ్యర్థిగా గురువారం నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న సువేందు అధికారి దీటుగా ప్రచారం చేస్తున్నారు. మమతా బెనర్జీ స్థానికురాలు కాదని, తానే ఈ భూమి పుత్రుడినంటూ ప్రచారం చేసుకోవడం విశేషం.
(The above story first appeared on LatestLY on Mar 11, 2021 04:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

