ICC Cricket World Cup 2023: డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం, శ్రీలంక చేతిలో భారీ ఓటమి, వరుసగా నాలుగో పరాజయంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
England Cricket Team. (Photo Credits: @WorldCup23_/twitter)

వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్‌ బృందాన్ని ఈ రోజు శ్రీలంక మట్టి కరిపించింది. వరల్డ్‌కప్‌లో ఇం‍గ్లండ్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదో విజయం నమోదు చేసింది. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఖాతాలో నాలుగో పరాజయం చేరింది.

వరల్డ్ కప్ ముందు వరకు అత్యంత బలంగా కనిపించిన ఇంగ్లండ్ కు మెగా టోర్నీలో ఓటములు అలవాటుగా మారాయి. జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఇవాళ శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 25.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 77, సదీర సమరవిక్రమ 65 పరుగులతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు.

భీకర ఫామ్‌లో టీమిండియా, సెమీస్ బెర్త్ నిర్ణయించే మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్‌ రెడీ, లక్నో చేరుకున్న టీమిండియా ప్లేయర్స్, ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపించిన అభిమానులు (వీడియో ఇదుగోండి)

ఓ దశలో శ్రీలంక 23 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా (4), కెప్టెన్ కుశాల్ మెండిస్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ రెండు వికెట్లు డేవిడ్ విల్లీ ఖాతాలో చేరాయి. అయితే, నిస్సాంక, సమరవిక్రమ జోడీ మరో వికెట్ పడకుండా అజేయంగా శ్రీలంకను గెలుపు తీరాలకు చేర్చారు. ఈ విజయంతో శ్రీలంక సెమీస్ అవకాశాలను కొద్ది మేర మెరుగుపర్చుకుంది. 5 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అటు, తాజా ఓటమితో ఇంగ్లండ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.

ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 29న టీమిండియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కథ ముగిసినట్టే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 9వ స్థానంలో ఉంది.ఒకవేళ మిగిలిన మ్యాచ్‌లలో గెలిచినా. .ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. గత ఎడిషన్‌లో సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌ ఈసారి కనీసం టాప్‌-4లో కూడా చేరకుండా నిష్క్రమించే దుస్థితికి చేరువైంది.