IPL 2021 New Venue: ఐపీఎల్‌-2021 మళ్లీ వచ్చేస్తోంది, మిగిలిన మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, రెండో దశ పోటీలకు తమ ఆటగాళ్లను అనుమతించేది లేదని తెలిపిన ఇంగ్లండ్
IPL Cup

ఇండియాలో కరోనావైరస్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఐపీఎల్‌-2021 వాయిదా పడిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తోంది. దీనిపై ఈ రోజు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice-President Rajeev Shukla) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యూఏఈలో (IPL 2021 Has Been Moved to UAE) నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రెండో ద‌శ ఆట‌కు (IPL 2021) వేదిక ఖ‌రారైన నేప‌థ్యంలో దీనిపై త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కాగా, కొన్ని రోజులుగా విదేశీ క్రికెట్ బోర్డుల‌తో బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. క‌రోనా వేళ‌ విదేశీ ఆట‌గాళ్ల‌ను ఈ మ్యాచుల్లో ఆడించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాగే, టీ20 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌యం కోరుతోంది.

కరోనా కల్లోలం..ఐపీఎల్ నిరవధిక వాయిదా, తాజాగా సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లకు కరోనా, ఐపీఎల్ 2021 వాయిదాను అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా

ఇదిలా ఉంటే తమ ఆటగాళ్లను మాత్రం రెండో దశ పోటీలకు అనుమతించేది లేదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఇరు బోర్డుల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నా... లీగ్‌ కోసం తమ జాతీయ జట్టు షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేమని ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యాష్లే గైల్స్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 18నుంచి ఐపీఎల్‌ మళ్లీ జరిగే అవకాశం ఉండగా, అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఇంగ్లండ్‌ తలపడనుంది. ‘ఐపీఎల్‌ కోసం టెస్టు సిరీస్‌ తేదీల్లో మార్పులు చేయమని మాకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తీ రాలేదు.

Here's ANI Update

భారత్‌తో చివరి టెస్టు ఆడగానే ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ బయల్దేరతారు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్, ఆపై టి20 ప్రపంచ కప్‌ ఉన్నాయి. మున్ముందు యాషెస్‌ సిరీస్‌ కూడా ఉంది కాబట్టి కొందరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు మేం విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం. దానర్థం వారికి విరామం ఇచ్చిన సమయంలో ఎక్కడికైనా వెళ్లి క్రికెట్‌ ఆడుకోమని కాదు’ అని ఐపీఎల్‌నుద్దేశించి గైల్స్‌ వ్యాఖ్యలు చేశారు.