Cyclone Gulab: సముద్రం అల్లకల్లోలం..తీవ్ర తుఫానుగా బలపడిన గులాబ్‌, వణుకుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌, సైక్లోన్ రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం
Satellite picture of cyclone Amphan (Photo Credits: IMD)

Amaravati, Sep 26: ఏపీలో ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్‌ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి శనివారం సాయంత్రానికి గులాబ్‌ తుపానుగా మారింది. ఇది (Cyclone Gulab) ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 370 కి.మీ., శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి తూర్పు దిశలో 440 కి.మీ. దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్‌ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది.

గులాబ్ శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి.. పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కాస్త పరిస్థితుల మార్పు చెందితే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

గులాబ్ తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Cyclone Gulab to Make Landfall Today) కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దండోరా వేయించారు.తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందం, ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

తెలంగాణలో మూడు రోజల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, తీవ్ర వాయుగుండంగా మారిన అల్ప పీడనం

పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్‌ సమస్యలు ఎదురైతే యుద్ధప్రాతిపదికన సరిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆర్‌ అండ్‌ బీ శాఖను ఆదేశించింది. కోవిడ్‌ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉంచుకోవాలని, కోవిడ్‌–19 బారిన పడిన వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

28న మరో అల్ప పీడనం

ఈ నెల 27న ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని అధికారులు భావిస్తున్నారు.