Cyclone Update: తూర్పు మధ్య బంగాళాఖాతంలో 20 తర్వాత వాయుగుండం..బలపడితే తుఫానుగా మారే అవకాశం.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక..

బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఉత్తర థాయ్‌లాండ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఎగువ వాయు ఆవర్తనం సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Cyclone Update: బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఉత్తర థాయ్‌లాండ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఎగువ వాయు ఆవర్తనం సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తాజా బులెటిన్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఈ వ్యవస్థ క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదిలి దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు చేరే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది.

హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ప్రస్తుతం ఈ వ్యవస్థను తుపానుగా ప్రకటించే స్థాయిలో పరిస్థితులు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్ 19 తర్వాత వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందో పరిశీలించిన తర్వాతే దాని తీవ్రత, గమనం, తీరాన్ని దాటే ప్రాంతంపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా వాతావరణ కేంద్రాల నుంచి కూడా ప్రస్తుతం వస్తున్న సమాచారం ఇదే విషయాన్ని సూచిస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న “తుపాను ఖరారైంది” లేదా “తీవ్ర తుపాను వస్తోంది” వంటి ముందస్తు అంచనాలను అధికారిక హెచ్చరికలుగా పరిగణించకూడదు.

అయితే వర్షాల విషయంలో మాత్రం ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న జారీ చేసిన IMD హెచ్చరికల ప్రకారం కోస్తాంధ్రలో సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 23న కూడా కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయవ్య దిశగా కదిలే క్రమంలో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సెప్టెంబర్ 19 నుంచి వర్షాలు, ఉరుములు, బలమైన గాలుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రత ఆధారంగా మరిన్ని హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.

ఇక “ఆర్నబ్” పేరుతో తుపాను ఏర్పడబోతోందన్న ప్రచారం ప్రస్తుతం అధికారికంగా నిర్ధారించబడలేదు. ఒక అల్పపీడనం ఏర్పడటం నుంచి అది వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే వరకు అనేక దశలు ఉంటాయి. ప్రతి అల్పపీడనం తుపానుగా మారాల్సిన అవసరం లేదు. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారాన్ని బట్టి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, అది ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా వైపు కదిలే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది.. తుపానుగా మారుతుందా లేదా అనేది తర్వాతి రోజుల్లోనే తేలనుంది.

ఈ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు, రహదారులపై రాకపోకలకు అంతరాయం, వాగులు పొంగిపొర్లడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించడం కీలకం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement