Visakhapatnam Shocker: వీడియో ఇదిగో.. టీచర్ అరుపులకు భయంతో వణికి.. ఒక్కసారిగా కుప్పకూలిన బాలుడు.. తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన చిన్నారి..
పాఠశాలలో హోమ్వర్క్ చేయలేదన్న భయానికి తోడు, ఉపాధ్యాయురాలి తీవ్ర మందలింపు, కొట్టడంతో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన అత్యంత హృదయవిదారకమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
Visakhapatnam Shocker: పాఠశాలలో హోమ్వర్క్ చేయలేదన్న భయానికి తోడు, ఉపాధ్యాయురాలి తీవ్ర మందలింపు, కొట్టడంతో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన అత్యంత హృదయవిదారకమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. నగరంలోని టౌన్కొత్తరోడ్డు ప్రాంతానికి చెందిన తమ్మన కృష్ణప్రసాద్, సాయిలక్ష్మి దంపతుల కుమారుడు ప్రణయ్తేజ్ (6) స్థానిక లిటిల్ గార్డెన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.
గురువారం ఉదయం తరగతి గదిలో హోమ్వర్క్ పరిశీలిస్తున్న సమయంలో.. తాను హోమ్వర్క్ పూర్తి చేయలేదని బాలుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఉపాధ్యాయురాలు పిలవడంతో భయపడుతూ దగ్గరకు వెళ్లగా, ఆమె కోపంతో బాలుడి చేతిలోని పలకను లాగేసుకుని తీవ్రంగా మందలించారు. అనంతరం చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో.. భయాందోళనకు గురైన ఆ చిన్నారి ఒక్కసారిగా స్పృహతప్పి టీచర్ ఒడిలోనే కుప్పకూలిపోయాడు.
బాలుడిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత కేజీహెచ్కి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పసిపాప మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు తమ బిడ్డ మృతికి కారణమైన టీచర్, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Class 1 Student Dies After Teacher Beats Him for Not Doing Homework
ఈ ఘోర ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు విశాఖపట్నం జేడీ, డీఈవో, ఆర్డీవోలతో కూడిన త్రిసభ్య కమిటీని విద్యాశాఖ నియమించింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.