Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, తక్షణమే విచారణ అధికారిని మార్చేయాలని తెలిపిన అత్యున్నత ధర్మాసనం
Supreme Court. (Photo Credits: PTI)

Amaravati, Mar 27: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో (Viveka Murder Case) సీబీఐ దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. విచారణ అధికారిని తక్షణమే మార్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు స్టేటస్‌ రిపోర్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసిన సుప్రీం.. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారిని మార్చేయాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా సీబీఐకి సూచించారు. 2019 నుంచి స్టేటస్‌ పురోగతిలో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. రాజకీయ కారణాల వల్లే హత్య జరిగిందని చెప్తున్నారు. దోషుల్ని పట్టుకునేందుకు ఈ కారణాలు సరిపోవు. వివేకా హత్యలో భారీ కుట్ర ఉందని హైకోర్టు చెప్పింది. కేసు మెరిట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని కోర్టు పేర్కొంది.

వైఎస్ వివేకా హత్య కేసు, సీబీఐ విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

కాగా తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై గత సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. దర్యాప్తు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. దీంతో దర్యాప్తు పురోగతి, పూర్వాపరాల విషయాలపై నివేదిక దాఖలు చేసినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు.

వివేకానందరెడ్డి హత్య కేసు, ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ, తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపిన కడప ఎంపీ

విచారణ సందర్భంగా.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సోమవారం వాదనల సందర్భంలో.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది.తాజాగా విచారణ అధికారిని తక్షణమే మార్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.