Weather Update: హల్దియా వద్ద తీరం దాటిన వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. మత్స్యకారులకు అలర్ట్

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Telangana heavy Rains,

Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వర్షాలు కురిసే అవకాశం.. 27 జులై 2026 సోమవారం ఉష్ణోగ్రత 29°Cకి చేరే అవకాశం

సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరప్రాంత ఓడరేవుల్లో హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ప్రధాన ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మిగిలిన కోస్తా ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మత్స్యకారులు బుధవారం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో మరో మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ముందుగానే లాగ్‌అవుట్ అయ్యేలా అనుమతించాలని సూచించారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సుమారు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,070 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తుండటం గమనార్హం. మరోవైపు మహారాష్ట్రలోని నాసిక్ పరిసరాల్లో కురుస్తున్న వర్షాలతో జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రధాన జలాశయాలకు మరింత వరద నీరు చేరే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవవద్దని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement