El Niño Effect: ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ఈ సీజన్ వరి పంట వేయవద్దని ప్రభుత్వం హెచ్చరిక.. బోరు బావుల కింద సైతం సాగు చేయవద్దని రైతులకు ఆదేశాలు..
El Niño Effect: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయ రంగానికి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రైతులు వరి పంటను వేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది.
El Niño Effect: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయ రంగానికి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రైతులు వరి పంటను వేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. చివరికి బోరు బావుల కింద కూడా వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఎల్నినో వల్ల రాబోయే రోజుల్లో నీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఈ అంశంపై ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని యంత్రాంగానికి సూచించింది.
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై రెండో మాసం కూడా ముగుస్తున్నా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడక కరువు ఛాయలు అలముకుంటున్నాయి. సాధారణంగా జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ.. జూలై రెండో వారం నాటికి రుతుపవనాలు పుంజుకుని వర్షాలు పడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఎల్నినో ప్రతికూల ప్రభావం కారణంగా వాతావరణంలో తేమ తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా లోటు వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ (IMD) ముందస్తు అంచనాల్లో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి విరుద్ధంగా మారాయి. జూన్ నెలలో రాష్ట్రంలో దాదాపు 12 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. జూలై మూడో వారం నాటికి ఏకంగా 49 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత వారంలో కూడా అనుకూల వర్షపాత సూచనలు కనిపించకపోవడంతో వాతావరణ, వ్యవసాయ నిపుణులు తీవ్ర కంగారు వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గడంతో వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను వేస్తే రైతులు పెట్టుబడులు కోల్పోయి నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే బోరు బావులపై ఆధారపడే రైతులు సైతం వరికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు లేదా ప్రత్యామ్నాయ ఉద్యానవన పంటలను సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.