Harish Rao Sensational Comments: కాళేశ్వరాన్ని కూల్చేందుకు రేవంత్ సర్కారు కుట్ర, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, మేడిగడ్డపై అఖిలపక్షాన్ని పిలిస్తే వస్తాం
బీఆర్ఎస్ను పడగొట్టెందుకు.. కాళేశ్వరం పడగొట్టే కుట్ర రేవంత్ రెడ్డి (Revanth reddy) చేస్తున్నారని మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ (Medigadda) పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది.
Hyderabad, March 01: బీఆర్ఎస్ను పడగొట్టెందుకు.. కాళేశ్వరం పడగొట్టే కుట్ర రేవంత్ రెడ్డి (Revanth reddy) చేస్తున్నారని మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ (Medigadda) పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు (Former Minister Harish Rao) మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నారని, అందుకే కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యత గల ప్రభుత్వంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే.. అఖిల పక్షం పిలవాలని, తామే సూచనలు చేస్తామని చెప్పారు. రాజకీయాలకు ఇది సమయం కాదని హితవు పలికారు.
రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోనేది లేదన్నారు. మేడిగడ్డ తెలంగాణ భవిష్యత్కు సంబంధించిన సమస్య గా హరీశ్ రావు పేర్కొన్నారు. మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు కలిగితే కేసీఆర్ (KCR) ఊరుకోడని హరీష్ రావు హెచ్చరించారు.
మేడి గడ్డకు వెళ్తున్నాం అంటేనే కాంగ్రెస్ పోటీ యాత్రలు చేస్తుందని మండిపడ్డారు. నల్గొండలో సభతో కృష్ణ జలాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మేడి గడ్డ రిపేర్ చేస్తామని ఉత్తమ కుమార్ చెప్పారంటే బీఆర్ఎస్ యాత్ర సక్సెస్ అయినట్టేనన్నారు. గత ప్రభుత్వాలను బద్నాం చేయాలనేది తప్ప వేరే కనిపించడం లేదని మాజీ మంత్రి దుయ్యబట్టారు.
గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వంద కంపోనెంట్లలో మేడి గడ్డ ఒకటని, మూడు పిల్లర్లు కుంగితె ప్రాజెక్ట్ మొత్తం వ్యర్దం అయిందని అనడం దారుణమన్నారు. రానున్న వానాకాలం లోపే మేడిగడ్డ రిపేరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.