Old City Metro Update: పాతబస్తీలో మెట్రో కల సాకారానికి మరో అడుగు.. భూసేకరణలో వేగం పెంచనున్న హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ పాత బస్తీ నగరంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) చర్యలు ముమ్మరం చేసింది.

Hyderabad Metro official handle on X hacked(X)

Old City Metro Update: హైదరాబాద్ పాత బస్తీ నగరంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) చర్యలు ముమ్మరం చేసింది. దారుల్షిఫా నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర చేపడుతున్న రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులను హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ ఎస్. భాస్కర్ రెడ్డితో కలిసి ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాత నగర మెట్రోను త్వరితగతిన పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలను గుర్తుచేస్తూ, క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 888 ఆస్తులు ప్రభావితమవుతుండగా.. ఇప్పటికే మెజారిటీ స్థలాలను సేకరించిన అధికారులు ఇంకా కేవలం 55 ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, తాగునీటి పైప్‌లైన్‌ల తరలింపు పనులను తక్షణమే పూర్తి చేయాలని, అలాగే కూల్చివేతల శిథిలాలను త్వరితగతిన తొలగించి రోడ్డు విస్తరణకు మార్గం సుగమం చేయాలని ఆదేశించారు. పనులకు సంపూర్ణంగా సహకరిస్తున్న పాత నగర నివాసితులకు ఈ సందర్భంగా అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం దిశగా హైదరాబాద్.. మొబిలిటీ ప్రాజెక్టులకు వేగం..

కాగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు వెళ్లే ఈ మెట్రో ఫేజ్-II కారిడార్ కోసం భూసేకరణను సవాలు చేస్తూ ఎనిమిది మంది ఆస్తి యజమానులు కోర్టును ఆశ్రయించడంతో 2025 జనవరిలో హైకోర్టు స్టే విధించింది. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపి, ఆగస్టు 10న ఆ స్టేను ఎత్తివేసింది. చట్టానికి కచ్చితంగా అనుగుణంగా భూసేకరణ పనులతో ముందుకు సాగవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయి, పాత నగర మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement