Telangana Rains: తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచన, నిర్మల్ జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని అధికారులకు ఆదేశాలు

ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా ఇండ్లల్లో ఉండడమే క్షేమమని సీఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు....

Telangana CM KCR | File Photo

Hyderabad, July 22: తెలంగాణలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీట మునిగిందని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని, సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, రెవిన్యూ, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సీఎం సూచించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆయా రాష్ట్రాల వాళ్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉధృతి పెరగనున్నదని గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా అందరూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా ఇండ్లల్లో ఉండడమే క్షేమమని సీఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులందరూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement