Eiffel Tower Row: ఈఫిల్ టవర్ వద్ద తీవ్ర వివాదం.. మహిళా ఉద్యోగులను దూరంగా ఉంచారంటూ సిబ్బంది సమ్మె.. ఉద్యోగుల నిరసనతో ఈఫిల్ టవర్ మూసివేత
ప్రపంచ ప్రసిద్ధ పారిస్ పర్యాటక ప్రాంతమైన ఈఫిల్ టవర్ వద్ద అనూహ్య నిరసన వ్యక్తమైంది. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) కి చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా, మహిళా ఉద్యోగులను వారి విధుల నుంచి పక్కకు తప్పించారన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
Eiffel Tower Row: ప్రపంచ ప్రసిద్ధ పారిస్ పర్యాటక ప్రాంతమైన ఈఫిల్ టవర్ వద్ద అనూహ్య నిరసన వ్యక్తమైంది. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) కి చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా, మహిళా ఉద్యోగులను వారి విధుల నుంచి పక్కకు తప్పించారన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈఫిల్ టవర్ సిబ్బంది విధులను బహిష్కరించడంతో.. సందర్శకుల కోసం టవర్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నిర్వహణ సంస్థ ‘సెట్’ ప్రకటించింది.
శనివారం ఫ్రాన్స్లో కొత్తగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవం అనంతరం BAPS సంస్థకు చెందిన సుమారు 100 మంది సభ్యుల బృందం ఈఫిల్ టవర్ను సందర్శించింది. ఈ సందర్శన సమయంలో మహిళా సిబ్బందితో సంభాషణలను పరిమితం చేయాలని, వారు ఎదురుపడకుండా చూడాలని ప్రతినిధి బృందం కోరినట్లు సమాచారం. ఈ నిబంధనలకు అంగీకరించిన యాజమాన్యం, మహిళా ఉద్యోగులను వారి పనివేళల్లో విధుల నుంచి దూరంగా తరలించిందని యూనియన్ ప్రతినిధి డయాన్ డవోయిన్ ఆరోపించారు. తమ లింగం ప్రాతిపదికన పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది వాకౌట్ చేయగా, ఇటువంటి షరతులకు అంగీకరించి ఉండకూడదని, ఇది తమ పొరపాటేనని సెట్ యాజమాన్యం అంగీకరించింది.
ఈ వివాదంపై పారిస్లోని BAPS వర్గాలు స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. సంభవించిన అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూనే.. తాము సమానత్వం, సార్వత్రిక గౌరవ విలువలను విశ్వసిస్తామని పేర్కొన్నాయి. ఇతరులకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ముందస్తు అనుమతితో ఉదయాన్నే పర్యటనను ఏర్పాటు చేసుకున్నామని వివరణ ఇచ్చాయి. మరోవైపు, ఇటువంటి వివక్షతతో కూడిన షరతులకు అంగీకరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ మండిపడుతూ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. విదేశీ సందర్శకుల అభ్యర్థనల పేరుతో మహిళలు పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదని జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాఎల్ బ్రాన్-పివెట్ స్పష్టం చేశారు.
ఫ్రాన్స్లో BAPS సంస్థ తన మొదటి భవ్య హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మరుసటి రోజే ఈ వివాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం జరిగిన ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపిస్తూ.. ఈ ఆలయం భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న వ్యూహాత్మక, సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.