
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూపు 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు (TGPSC Group 1 Results)విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు www.tspsc.gov.in లో తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చు.ఈ మార్కులను మార్చి 16 సాయంత్రం 5గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.అభ్యర్థులు మెయిన్స్లో సాధించిన మార్కుల షీట్లను డౌన్లోడ్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాచి ఉంచాలని టీజీపీఎస్సీ సూచించింది. ఫలితాల కోసం లింక్ క్లియ్ చేయండి
జూన్ 9, 2024న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వారిలో 21,093 మంది మొత్తం ఏడు పేపర్లు రాశారు. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహంచిన ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. ఇక అభ్యర్థులకు తమ మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులందరి మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో ఉంచుతారు. తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసి.. దాని ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలవనున్నారు. నోటిఫికేషన్లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. మార్కుల షీట్లు డౌన్లోడ్/ రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఎదురైతే.. అభ్యర్థులు 040-23542185/040-23542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.
ఎగ్జామ్ వివరాలు ఇవే..
ఖాళీల సంఖ్య: 563
వచ్చిన దరఖాస్తుల సంఖ్య: 4.03 లక్షలు
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్ 9
మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు: 31,383
తరువాత అదనంగా 20 మంది క్రీడా అభ్యర్థులను చేర్చుకున్నారు.
మెయిన్స్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 21 నుండి 27 వరకు
ఏడు పేపర్లకు హాజరైన అభ్యర్థుల సంఖ్య: 21,093
తెలంగాణలో పరీక్షా కేంద్రాల సంఖ్య: 897
ప్రచురించబడింది - మార్చి 10, 2025 03:37 pm IST