Nepal Floods: నేపాల్ వరద బాధితురాలి మృతదేహంపై దారుణం.. బంగారు చెవిపోగులు దొంగిలించి పోలీసులకు చిక్కిన ఇద్దరు.. వీడియో ఇదిగో..
నేపాల్లో వరదల నేపథ్యంలో ఒక మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
Nepal Floods: నేపాల్, చైనా సరిహద్దుల్లో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 392 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. అనేక గ్రామాలు ధ్వంసమై సహాయక చర్యలు కొనసాగుతున్న ఈ క్లిష్ట సమయంలో, మానవత్వాన్ని ప్రశ్నించేలా ఒక అమానుష సంఘటన వెలుగు చూసింది.
నారాయణి నదిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహాన్ని కొందరు చెక్కల సహాయంతో ఒడ్డుకు తీశారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను దొంగిలించారు. ఈ దారుణ దృశ్యాలు 41 సెకన్ల వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Police Arrest Two for Stealing Earrings From Dead Body During Floods
వీడియో ఆధారంగా నిందితులైన మదన్ గురుంగ్ (25), ఉమేశ్ చౌదరి (38)లను భరత్పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. విపత్తు సమయంలో ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు చైనా భూభాగంలోని టిబెట్ గైరాంగ్ పోర్ట్ వద్ద భారీగా బురద ప్రవాహం విరుచుకుపడి బహుళ అంతస్తుల భవనం, బస్ పార్కింగ్ ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్లన్నీ సుమారు 5 అడుగుల లోతున బురదతో నిండిపోయినట్లు చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది. వర్షాలు కొనసాగుతుండటంతో మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.