EPFO 3.0 Explained: UPIతో PF డబ్బులు తీసుకోవచ్చా.. కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.. మార్పులపై పూర్తి వివరణ..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) తన చందాదారులకు భారీ ఊరట నిచ్చేందుకు సమగ్ర డిజిటల్ సీఆర్ఎమ్ను ఆధునీకరిస్తూ ‘EPFO 3.0’ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తోంది
EPFO 3.0 Explained: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) తన చందాదారులకు భారీ ఊరట నిచ్చేందుకు సమగ్ర డిజిటల్ సీఆర్ఎమ్ను ఆధునీకరిస్తూ ‘EPFO 3.0’ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తోంది. పీఎఫ్ (PF) ఉపసంహరణ లేదా బదిలీ ప్రక్రియలో అయ్యే తీవ్ర జాప్యానికి స్వస్తి పలుకుతూ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), UPI-ఎనేబుల్డ్ ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ గతంలో ఉన్న వికేంద్రీకృత డేటాబేస్ స్థానంలో 'సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్' (CITES) ప్రాజెక్ట్ కింద ఒకే జాతీయ కేంద్రీకృత ప్లాట్ఫారమ్కు చందాదారుల సమాచారాన్ని విజయవంతంగా తరలించింది.
EPFO 3.0 తో రానున్న కీలక మార్పులు:
UPI & ATM విత్డ్రా: గతంలో పీఎఫ్ విత్డ్రా దరఖాస్తు చేసిన తర్వాత డబ్బులు ఖాతాలో పడటానికి 15 నుండి 20 రోజులు పట్టేది. కొత్త వ్యవస్థ ద్వారా అర్హతగల పీఎఫ్ బ్యాలెన్స్లో 50% నుండి 75% వరకు UPI పిన్ లేదా UPI-ATMల ద్వారా తక్షణమే బ్యాంకు ఖాతాకు మళ్లించుకోవచ్చు.
ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెంపు: ఇల్లు, వైద్య చికిత్స, వివాహం మరియు విద్యావసరాల కోసం గతంలో రూ. 1 లక్ష వరకు ఉన్న ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచారు. ఈ క్లెయిమ్లు కేవలం మూడే రోజుల్లో పూర్తవుతాయి.
ఫేస్ అథెంటికేషన్ (FAT): సభ్యులు UMANG యాప్లో 'ఫేస్ అథెంటికేషన్' టెక్నాలజీ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి UANని యాక్టివేట్ చేసుకోవడం, పాస్బుక్ చూడటం మరియు తప్పులను సవరించుకోవడం క్షణాల్లో పూర్తి చేయవచ్చు.
స్పష్టమైన సమాచారం & సులభ పరిష్కారాలు: ఏ కారణాల చేత ఎంత మొత్తం పొందేందుకు అర్హత ఉందో సిస్టమ్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ క్లెయిమ్లో సందేహాలు ఉంటే కార్యాలయాలకు తిరగాల్సిన పనిలేకుండా ఆన్లైన్ ద్వారానే వివరణ ఇచ్చే సదుపాయం కల్పించారు.
8.25% వడ్డీ జమ
మరోవైపు, 2026 ఆర్థిక సంవత్సరానికి గాను EPF మరియు VPF ఖాతాలపై 8.25% వడ్డీ రేటును నిర్ణయించగా, జూలై నాటికే ఈ వడ్డీ మొత్తాన్ని సబ్స్క్రైబర్ల ఖాతాల్లో క్రెడిట్ చేసినట్లు తెలిపింది. ఈపీఎఫ్ఓ వరుసగా మూడోసారి 8.25% రాబడిని అందించడం విశేషం. కాగిత రహిత, పారదర్శకమైన ఈ కొత్త డిజిటల్ విధానం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో నిధుల కొరత తీరడమే కాకుండా పీఎఫ్ ఉపసంహరణ అత్యంత సులభతరం కానుంది.