Wrestlers Argument with Delhi Police: రెజ్లర్ల క్యాంపులో అర్ధరాత్రి హైడ్రామా, పోలీసులు-రెజ్లర్ల మధ్య తోపులాట, పోలీసుల దాడిలో దుష్యంత్ ఫొగట్కు గాయాలు
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్ల పట్ల లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
New Delhi, May 04: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్ల పట్ల లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీలకు, రెజ్లర్లకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తమపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని రెజ్లర్లు (Wrestlers) ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడిలో ఇద్దరు క్రీడాకారుల తలకు బలమైన గాయాలయ్యాయని, మహిళా రెజ్లర్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. మహిళా క్రీడాకారిణి గీతా ఫోగట్ వివాదంపై ట్వీట్ చేశారు. రెజర్లపై పోలీసులు చేసిన దాడిలో నా తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలకు గాయమైందని, మరో రెజ్లర్ కూడా గాయపడ్డాడని చెప్పారు. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు.
రెజ్లర్లు, పోలీసుల ఘర్షణపై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. తాను ఆటగాళ్లను కలిసేందుకు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాను. నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ కు తనను తీసుకొచ్చారని ఎంపీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఆప్ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి (Somanath Bharathi) రెజ్లర్ల కోసం నిరసనకారుల స్థలంలో మడత మంచాలను తీసుకురావడంతో గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. నిరసన ప్రదేశాల్లోకి పరుపులను తీసుకురావడాన్ని పోలీసులు నిరాకరించారు. ఈ విషయంపై న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ.. సోమనాథ్ భారతి అనుమతి లేకుండా నిరసన ప్రదేశానికి మడత మంచాలతో వచ్చారు. మడత మంచాల గురించి ఆయన్ను పోలీసులు ప్రశ్నించడంతో అతని మద్దతుదారులు దూకుడుగా ప్రవర్తించారని, ట్రక్కు నుండి మడత మంచాలను దించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఆ తరువాత చిన్న వాగ్వాదం చోటు చేసుకుందని, తరువాత భారతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని తెలిపారు.