Guillain Barre Syndrome Cases Increased in Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది
గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barre Syndrome) కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. అక్కడ గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
Mumbai, JAN 26: గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barre Syndrome) కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. అక్కడ గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. పుణేకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ కొన్ని రోజులుగా విరేచనాలతో బాధపడుతున్నాడు. ఇటీవల అతడు సోలాపూర్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్ళాడు. నిరసంగా ఉండటంతో సోలాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.
కాగా, ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధి బారినపడినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ వ్యక్తికి ఐసీయూలో చికిత్స అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో శనివారం ఐసీయూ నుంచి వార్డులోకి తరలించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆ వ్యక్తి అదే రోజున మరణించినట్లు అతడి బంధువులు తెలిపారు.
గులియన్ -బారే సిండ్రోమ్ అనేది అరుదైన రోగ నిరోధక నరాల వ్యాధి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీంతో ఆకస్మికంగా తిమ్మిరి, కండరాల బలహీనత ఏర్పడుతుంది. అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలుంటాయి.
మరోవైపు పూణేలో 73 మందికి ఈ వ్యాధి సోకింది. వీరిలో14 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 9 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే మహారాష్ట్రలో తొలి మరణం కూడా నమోదు కావడంతో పూణే అధికారులు అలెర్ట్ అయ్యారు