N. Chandrasekaran Resigns: టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా.. వచ్చే కొత్త సారథి ముందు ఎన్నో సవాళ్లు..
భారతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ టాటా సన్స్ గ్రూపులో నాయకత్వ పరిణామం చోటుచేసుకుంది. గడిచిన దాదాపు దశాబ్ద కాలంగా టాటా గ్రూప్ను విజయవంతంగా నడిపిస్తున్న ఎన్. చంద్రశేఖరన్.. 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న తన ప్రస్తుత పదవీకాలం తర్వాత మరోమారు ఛైర్మన్గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు.
N. Chandrasekaran Resigns: భారతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ టాటా సన్స్ గ్రూపులో నాయకత్వ పరిణామం చోటుచేసుకుంది. గడిచిన దాదాపు దశాబ్ద కాలంగా టాటా గ్రూప్ను విజయవంతంగా నడిపిస్తున్న ఎన్. చంద్రశేఖరన్.. 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న తన ప్రస్తుత పదవీకాలం తర్వాత మరోమారు ఛైర్మన్గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. తదుపరి వారసుడి ఎంపిక ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా తమ నిర్ణయాన్ని ముందే తెలియజేసినట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
తదుపరి ఐదేళ్ల కాలానికి చంద్రశేఖరన్ పదవీకాలాన్ని పొడిగించాలని సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లు ఏకగ్రీవంగా సిఫార్సు చేయగా.. టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ కూడా ఆ ప్రతిపాదనను సమర్థించింది. అయితే 2026 ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా ఈ పొడిగింపును వ్యతిరేకించడంతో స్పష్టత కొరవడింది.
టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయకూడదని.. బోర్డు ప్రాతినిధ్యం, భవిష్యత్ రోడ్మ్యాప్పై స్పష్టమైన షరతులు విధించాలన్న నోయెల్ టాటా ప్రతిపాదనలతో చంద్రశేఖరన్ విభేదించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశం జరిగి ఆరు నెలలు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. సంస్థ వ్యూహాత్మక ప్రయోజనాలు, ఉద్యోగులు, పెట్టుబడిదారులకు స్పష్టతనిచ్చేందుకు తప్పుకోవడమే సరైన మార్గమని చంద్రశేఖరన్ భావించారు.
1963లో తమిళనాడులోని మోహనూర్ గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రశేఖరన్, తమిళ మాధ్యమ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, తిరుచిరాపల్లి ఎన్ఐటీ నుంచి ఎంసీఏ పూర్తి చేశారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో సాధారణ ప్రొగ్రామర్గా చేరిన ఆయన, 2009లో టీసీఎస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి దానిని దేశంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా మార్చారు. ఆపై 2017 జనవరిలో టాటా సన్స్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించి, 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న టాటా గ్రూప్కు నాయకత్వం వహించిన మొదటి ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ మరియు మొదటి పార్సీయేతర వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆయన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2022లో 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించింది.
చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ మొత్తం ఆదాయం 2017లో రూ. 6 లక్షల కోట్ల నుండి 2026 నాటికి 2.5 రెట్లు పెరిగి రూ. 16.24 లక్షల కోట్లకు చేరింది. నికర లాభాలు రూ. 34,909 కోట్ల నుండి ఏకంగా 5 రెట్లు వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. వినియోగదారుల విశ్వసనీయతను తెరిపే నెట్ ప్రమోటర్ స్కోర్ (NPS) కూడా గణనీయంగా మెరుగైంది.
అయితే, కొత్తగా రాబోయే ఛైర్మన్ ముందుకు అనేక సంక్లిష్టమైన సవాళ్లు రానున్నాయి. 2022లో స్వాధీనం చేసుకున్న ఎయిర్ ఇండియా స్థిరమైన నష్టాలను నమోదు చేస్తుండటంతో దానిని లాభదాయకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దడం ప్రధాన సవాలుగా మారనుంది. అలాగే టెక్నాలజీ, సూపర్ యాప్ వంటి డిజిటల్ విభాగాల్లో వస్తున్న నష్టాలను అధిగమించి లాభాలను రాబట్టాల్సి ఉంటుంది.
మరోవైపు, ఆర్బీఐ 'అప్పర్ లేయర్ NBFC' నిబంధనల ప్రకారం టాటా సన్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్కు వెళ్లాలా లేదా హోదా మార్చుకోవాలా అనే కీలక నిర్ణయంతో పాటు.. నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్స్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ గ్రూప్ నిర్ణయాలను ఏకగ్రీవంగా అమలు చేయడం నూతన సారథికి అత్యంత కీలకంగా మారనుంది. చంద్రశేఖరన్ నిష్క్రమణ వార్తతో మార్కెట్లో టాటా కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికాగా, కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసేందుకు టాటా సన్స్ బోర్డు సిద్ధమవుతోంది.