Vande Mataram Bill: వందేమాతరం బిల్లుకు ఉభయసభలు ఆమోదం.. ఇకపై ఎవరైనా గీతాన్ని అవమానిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..
జాతీయ గీతం 'వందేమాతరం'ను అవమానించడం లేదా దాని ఆలాపనకు ఆటంకం కలిగించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించే 'జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026ను లోక్సభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది.
Vande Mataram Bill: జాతీయ గీతం 'వందేమాతరం'ను అవమానించడం లేదా దాని ఆలాపనకు ఆటంకం కలిగించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించే 'జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026ను లోక్సభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించిన మరుసటి రోజే.. ప్రతిపక్షాల ఆందోళనలు, తీవ్ర నిరసనల మధ్య దిగువ సభలోనూ దీనికి ఆమోదం లభించింది. ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం ముద్ర పడగానే అధికారికంగా చట్టరూపం దాల్చనుంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇస్తూ.. ఈ చట్టం ఏ భావజాలానికీ లేదా ఏ రాష్ట్రానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం.. రాష్ట్ర గీతాలను, స్థానిక భాషా గౌరవాన్ని ఎంతగానో గౌరవిస్తుంది. జాతీయ గీతంతో పాటు వందేమాతరానికి కూడా అదే స్థాయి చట్టబద్ధ రక్షణ కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అని ఆయన వివరించారు.
అమెరికాలో కొత్త బిల్లు.. హెచ్-1బీ వీసాలకు 3 ఏళ్ల బ్రేక్? భారతీయుల్లో ఆందోళన..
కాగా ఈ బిల్లును డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. డీఎంకే ఎంపీ కనిమొళి సభలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 'జాతీయవాదం' ముసుగులో తన 'హిందుత్వ' ఎజెండాను బలవంతంగా ప్రజలపై రుద్దుతోందని ఆరోపించారు. గతంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ పాటలోని లౌకికత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి రెండు చరణాలను మాత్రమే స్వీకరించారని.. కానీ ఇప్పుడు ఆరు చరణాలను తప్పనిసరి చేసి.. పాడకపోతే నేరంగా పరిగణించడం దేశాన్ని విభజించే ప్రయత్నమేనని ఆమె విమర్శించారు. తమిళనాడుతో పాటు తమకంటూ సొంత రాష్ట్ర గీతాలు ఉన్న అనేక రాష్ట్రాలను ఈ చట్టం అవమానించేలా ఉందన్నారు. నిరసనల మధ్య, ప్రతిపక్షాల మాట వినకుండా బిల్లును ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె మండిపడ్డారు.
జూలై 24న రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లు ద్వారా.. ఇప్పటికే జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతం (జనగణమన)లకు ఉన్నటువంటి చట్టబద్ధమైన రక్షణ, శిక్షార్హమైన నిబంధనలు ఇకపై 'వందేమాతరం'కి కూడా వర్తించనున్నాయి. ప్రతిపక్షాలు సభలో రామ మందిర విరాళాల వివాదం, విద్యార్థుల నిరసనలపై ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే ఈ బిల్లు ఆమోదం పొందింది.