Union Budget 2021: ఈ బడ్జెట్ సామాన్యుడి కల నెరవేరుస్తుందా? నేడు 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్, నెవర్ బిఫోర్ బడ్జెట్ అంటున్న కేంద్ర ఆర్థికమంత్రి
కోవిడ్ తో జన జీవితంతో పాటు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ (Union Budget 2021) ప్రవేశపెట్టనున్నారు.
Hyderabad, Feb 1: కోవిడ్ తో జన జీవితంతో పాటు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ (Union Budget 2021) ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. నెవర్ బిఫోర్ బడ్జెట్ను ప్రకటించనున్నట్లు ఇటీవల నిర్మల (FM Nirmala Sitharaman) ప్రకటించిన నేపథ్యంలో కరోనా మహమ్మారితో కుదేలైన వ్యవస్థలన్నీ ఈ బడ్జెట్పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.
బడ్జెట్ను లెదర్ బ్యాగ్లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ బడ్జెట్లో కరోనాతో చతికిలపడిన సామాన్యుడికి ఊరట కల్పించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలు న్నారు.
ఒక మధ్యంతర బడ్జెట్ సహా మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఇది 9వ బడ్జెట్. ఈ బడ్జెట్లో వైద్యారోగ్యం, మౌలిక వసతులు, రక్షణ రంగాల్లో కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు. ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, ఇతర అభివృద్ధి పథ కాలకు కూడా గరిష్టంగా కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రజల చేతిలో మరింత నగదు ఉండేందుకు వీలు కల్పించేలా కీలక ప్రకటన ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకు రావాలంటే.. దేశ బడ్జెట్ ఒక దార్శనిక ప్రకటనలా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కరోనా ప్రారంభమయ్యేనాటికే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. 2019–20 జీడీపీ 11 సంవత్సరాల కనిష్టానికి దిగజారి, 4 శాతానికి చేరింది. పెట్టుబడుల వృద్ధి రేటు కూడా తిరోగమనంలో ఉంది. ఆ తరువాత, కరోనా వైరస్ కట్టడికి ప్రకటించిన లాక్డౌన్తో ఆర్థికరంగ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దాంతో, ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రభుత్వం 3 ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిం చింది. అయితే, అవేమీ పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.
ఈ బడ్జెట్లో కరోనా టీకా కార్యక్రమం ఖర్చు ఎంత ఉండనుందనేది ఆసక్తిగా మారింది. బీపీసీఎల్, ఎస్సీఐ, ఎయిర్ఇండియా వంటి సంస్థల ప్రైవేటైజేషన్తో ఎంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్న విషయం కూడా నిపుణుల దృష్టిలో ఉంది.