Uttarakhand Tunnel Accident: వీడియో ఇదిగో.. ఉత్తరాఖండ్‌ చమోలీ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి..11 మందికి గాయాలు..

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పీపల్‌కోటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి గురువారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Chamoli Tunnel Collapse (Photo Credits: X/@KailashVashi)

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పీపల్‌కోటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి గురువారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 11 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, బురదలో చిక్కుకుపోయిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో గురువారం సాయంత్రం కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో టన్నెల్ పైభాగంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో టన్నెల్‌లోకి భారీ ఎత్తున బురద, నీరు, రాళ్లు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఆ సమయంలో లోపల పనిచేస్తున్న సుమారు 22 మంది కార్మికులు బయటకు రాలేకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు.

షాకింగ్ వీడియో ఇదిగో.. శివమొగ్గ ఆలయంలో లిఫ్ట్ కింద చిక్కుకుని రిటైర్డ్ ఇంజినీర్ మృతి.. భద్రతా లోపాలపై విచారణ జరుపుతున్న పోలీసులు

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), భారత సైన్యం, ఐటీబీపీ (ITBP) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. హెవీ డ్యూటీ పంపుల సాయంతో టన్నెల్‌లో నిండిపోయిన బురద నీటిని బయటకు తోడుతూ లోపల ఉన్నవారిని వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు వెలికితీసిన వారిలో ఏడుగురు మృతిచెందగా, గాయపడిన 11 మందిని వెంటనే గోపేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బురద కింద చిక్కుకుపోయిన మిగిలిన ఆరుగురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Uttarakhand Tunnel Accident: Seven Workers Dead, 11 Injured in Chamoli

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాష్ట్ర కంట్రోల్ రూం నుంచి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ప్రాజెక్టులో ఝార్ఖండ్‌కు చెందిన కార్మికులు కూడా పనిచేస్తుండటంతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మరియు వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం ధామి హామీ ఇచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement