Mulayam Singh Yadav Dies: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ములాయంకు ఐసీయూలో చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
NewDelhi, October 10: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) (Mulayam Singh Yadav) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో గురుగ్రామ్లోని మేదాంత (Medhanta) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం మరింత క్షీణించి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. యూపీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన ములాయం.. కేంద్ర రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
‘‘నా గౌరవ తండ్రి, ప్రతి ఒక్కరి నేత ఇక లేరు’’అంటూ ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పై చిన్న సందేశాన్ని హిందీలో పోస్ట్ చేశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, మూత్రనాళ ఇన్ఫెక్షన్ సైతం ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అఖిలేశ్ యాదవ్ తన భార్య డింపుల్ తో కలసి మేదాంత హాస్పిటల్ కు చేరుకున్నారు.