Cheruvugattu Shiva Brahmotsavams: నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Cheruvugattu Jadala Ramalingeswara Swamy Brahmotsavams) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Cheruvugattu, Feb 8: తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Cheruvugattu Jadala Ramalingeswara Swamy Brahmotsavams) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ( Jadala Ramalingeswara Swamy Brahmotsavams) ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ లైట్లతో అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు.
స్వామివారి కల్యాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం తరుఫున తలంబ్రాల బియ్యం, పట్టు వస్ర్తాలను సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ చైర్పర్సన్ మేకల అరుణా రాజిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం నేటి రాత్రి (బుధవారం తెల్లవారు జామున) స్వామివారి కల్యాణోత్సవం, తలంబ్రాల వేడుకను కనుల పండువగా నిర్వహించనున్నారు. గుట్టపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఇరువైపులా కర్రలతో రెయిలింగ్ ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమయ్యే కొబ్బరికాయలు, లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు సిద్ధ్దం చేసినట్లు అధికారులు తెలిపారు.
వాహనాల పార్కింగ్ కోసం ఎల్లారెడ్డిగూడెం, నార్కట్పల్లి వైపు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. చెర్వుగట్టుకు వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా గుట్ట కింద , ఆలయ ప్రాంగణంలో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని కంట్రోల్ రూమ్తో అనుసంధానించి పోలీసులు పర్యవేక్షించనున్నారు.
ఉత్సవ కార్యక్రమాల షెడ్యూల్
మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
9న తెల్లవారుజామున 4 గంటలకు స్వామి కల్యాణోత్సవం
11 తెల్లవారుజామున 4 గంటలకు అగ్ని గుండాలు
12న ఉదయం 6 గంటలకు దోపోత్సవం
ఆశ్వవాహన సేవ కార్యక్రమాలు
అదే రోజు రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవ
13న సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లారెడ్డిగూడెం,చెర్వుగట్టులో గ్రామోత్సవం
కొవిడ్ నిబంధనల కారణంగా తెప్పోత్సవం నిర్వహించడం లేదు.