Shivamogga Temple Tragedy: షాకింగ్ వీడియో ఇదిగో.. శివమొగ్గ ఆలయంలో లిఫ్ట్ కింద చిక్కుకుని రిటైర్డ్ ఇంజినీర్ మృతి.. భద్రతా లోపాలపై విచారణ జరుపుతున్న పోలీసులు
Shivamogga Temple Tragedy: కర్ణాటకలోని శివమొగ్గ దత్తాత్రేయ స్వామి ఆలయంలో జరిగిన ఎలివేటర్ (లిఫ్ట్) ప్రమాదంలో 80 ఏళ్ల విశ్రాంత ఇంజనీర్ తీవ్ర గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోభా నగర్కు చెందిన విశ్రాంత ఇంజనీర్ కుమారస్వామి (80) ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో నివాసం నుంచి బయలుదేరారు. వినాయక నగర్లోని రోటరీ బ్లడ్ బ్యాంక్లో రక్త పరీక్ష చేయించుకుని.. అనంతరం సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్తానని తన భార్య లలిత (75)కి చెప్పి వెళ్లారు.
ఆలయానికి చేరుకున్న కుమారస్వామి, పై అంతస్తుకు వెళ్లేందుకు ఎలివేటర్ బటన్ నొక్కారు. లిఫ్ట్ క్యాబిన్ కిందకు వచ్చిందనే భ్రమలో ఆయన బయటి మ్యాన్యువల్ డోర్ తెరిచి షాఫ్ట్లోకి అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో లిఫ్ట్ క్యాబిన్ పై అంతస్తులో ఉంది. ఆయన అడుగుపెట్టిన మరుక్షణమే పైనుంచి వేగంగా కిందకు దిగిన లిఫ్ట్ క్యాబిన్ ఆయనపై పడటంతో.. ఎలివేటర్ కింద చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్ కింద చిక్కుకున్న ఆయనను బయటకు తీశారు. అనంతరం మెక్గాన్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో అస్వాభావిక మరణం (UDR) కింద కేసు నమోదైంది. లిఫ్ట్ క్యాబిన్ అక్కడికి రాకుండానే బయటి తలుపు ఎలా తెరుచుకుంది.. మ్యాన్యువల్ డోర్ లాకింగ్ సిస్టమ్లో యాంత్రిక లోపం ఉందా? లేక ఆలయ యాజమాన్యం నుంచి ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో జిల్లా ఎస్పీ బి.నిఖిల్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Retired Engineer Dies After Falling Into Elevator Shaft at Karnataka Temple