Telangana Assembly Tragedy: అసెంబ్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన అధికారి.. వెంటనే CPR చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.. మార్గం మధ్యలో కన్నుమూత.. వీడియో ఇదిగో..

Telangana Assembly Tragedy.jpg

Telangana Assembly Tragedy: తెలంగాణ శాసనసభ ఆవరణలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత సహాయకుడు (PS) పీవీ రాజు అసెంబ్లీ ఆవరణలోనే అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోగా.. అక్కడే ఉన్న పర్యాటక, అటవీ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడి వద్దకు వెళ్లిన మంత్రి, ఆయనకు సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

రాజు కిందపడిపోవడం గమనించిన మంత్రి శ్రీహరి వెంటనే వైద్య సిబ్బందిని పిలిపించి, అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం హుటాహుటిన అంబులెన్స్‌ను రప్పించి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో, ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లోనే రాజు తుదిశ్వాస విడిచారు. బాధితుడిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అసెంబ్లీ వర్గాల్లో తీవ్ర సంతాపాన్ని నింపింది.

బాధితుడు విధుల్లో ఉన్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిన వెంటనే, ఒక మంత్రి హోదాలో ఉండి కూడా స్వయంగా ముందుకు వచ్చి సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి సమయస్ఫూర్తిని, దయాగుణాన్ని నెటిజన్లు, ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర సమయంలో ఆయన స్పందించిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందని అభినందనలు తెలుపుతున్నారు.

 Telangana Assembly Tragedy:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement