Rohit Sharma On Retirement: రిటైర్మెంట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన రోహిత్ శర్మ, ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందంటూ మనసులో మాట బయటపెట్టిన హిట్ మ్యాన్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన (Rohit Sharma On Retirement) లేనట్లు చెప్పాడు. తాను ఇప్పటికీ అత్యుత్తమ ఆట ఆడుతున్నానని, మరికొన్నాళ్ల పాటు ఆటను ఆస్వాదిస్తానని తెలిపాడు.
New Delhi, April 12: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన (Rohit Sharma On Retirement) లేనట్లు చెప్పాడు. తాను ఇప్పటికీ అత్యుత్తమ ఆట ఆడుతున్నానని, మరికొన్నాళ్ల పాటు ఆటను ఆస్వాదిస్తానని తెలిపాడు. టీమ్ఇండియా తరుపున ప్రపంచకప్ (World Cup) గెలవాలనేదే తన కోరిక అని రోహిత్ శర్మ అన్నాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో హిట్మ్యాన్ పై వ్యాఖ్యలు చేశాడు. ఆటకు వీడ్కోలు చెప్పాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. అయితే జీవితం ఎలా సాగుతుందో అనే విషయం మనకు తెలియదు. ఇప్పటికీ అత్యుత్తమ ఆటనే ఆడుతున్నా. మరికొన్నేళ్ల పాటు ఇలాగే ఆడుతూ ఆటలో కొనసాగాలని భావిస్తున్నా. ప్రపంచకప్ గెలవాలన్న ఆశ ఉంది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. టీమ్ఇండియా మరో ప్రపంచకప్ సాధించాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ 2025లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నానని రోహిత్ శర్మ అన్నాడు.
గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. వరుసగా 10 మ్యాచుల్లో గెలిచిన టీమ్ఇండియా ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ సమయంలో రోహిత్ శర్మ ఒక్కొ ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి. అయితే.. అవన్నీ రూమర్లే అని తేలిపోయాయి. మళ్లీ టీ20 ఫార్మాట్లో పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా జూన్ నుంచి 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టును రోహిత్ శర్మ నడిపిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరుపున దుమ్ములేపుతున్నాడు. మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. 5 మ్యాచుల్లో 167.74 స్ట్రైక్ రేటుతో 156 పరుగులు చేశాడు. హ్యాట్రిక్ ఓటములతో ఈ సీజన్ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలను సాధించింది. నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.