YS Jagan on AP Budget: బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ అయింది, కూటమి బడ్జెట్ మీద మండిపడిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఏపీ బడ్జెట్ మీద మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు.
Vjy, Mar 5: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఏపీ బడ్జెట్ మీద మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. ఆయన (YS Jagan on AP Budget) మాట్లాడుతూ..అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం (Chandrababu Govt) రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.
బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు.ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని జగన్ (YS Jagan Mohan Reddy) మండిపడ్డారు.
ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? జగన్ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన అంటూ విమర్శలు గుప్పించారు.
YS Jagan Press Meet
వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి. 18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు
స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. రైతు భరోసా పేరిట రైతన్నలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.