Stree Shakti Scheme: ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కారు గుడ్న్యూస్..AC బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Stree Shakti Scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొగల్తూరులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, సంక్షేమంతో కూడిన అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకు పింఛన్ల రూపంలోనే ప్రజలకు రూ. 73,000 కోట్లు అందించినట్లు గుర్తుచేశారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి కష్టాలను తీర్చేందుకే 'దీపం' పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెగా డీఎస్సీని అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకంగా 350 కేసులు వేశాయని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆపలేరని హితవు పలికారు. కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి పార్టీలు ఏకమయ్యాయని, ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించారు.