Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరిక..
ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారి రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది
Rain Alert: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారి రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
అల్పపీడనం దృష్ట్యా ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిక
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.
గురువారం నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో అత్యధికంగా 37 మిమీ, నంగినారపాడు మరియు వూడేరు ప్రాంతాల్లో 34.5 మిమీ, గంధవరంలో 33.5 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని విపత్తు నిర్వహణ శాఖ కోరింది.