RINL Land Monetisation: విశాఖలో భారీగా భూముల వేలం.. RINLకు చెందిన 459 భూ ప్లాట్లను ఈ-వేలంలో విక్రయించనున్న NLMC.. పూర్తి వివరాలివే
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC), ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) యాజమాన్యంలోని విలువైన భూముల విక్రయానికి ఇ-వేలాన్ని ప్రకటించింది.
RINL Land Monetisation: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC), ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) యాజమాన్యంలోని విలువైన భూముల విక్రయానికి ఇ-వేలాన్ని ప్రకటించింది. ఎటువంటి లీగల్ చిక్కులు లేని స్పష్టమైన ప్రభుత్వ టైటిళ్లతో కూడిన మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలోని 459 భూ పార్శిళ్ల పోర్ట్ఫోలియోను పూర్తిస్థాయి అమ్మకానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వేలం ప్రక్రియను సులభతరం చేసేందుకు 'క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (QIPL) సంస్థను ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్గా నియమించారు.
PF డబ్బు ATM నుంచి తీసుకోవచ్చా? UPI విత్డ్రాపై అసలు నిజం ఇదే
ఈ ఇ-వేలంలో భాగంగా అందుబాటులో ఉంచిన ప్లాట్ల పరిమాణం సుమారుగా 128.94 చదరపు గజాల నుండి 2,728 చదరపు గజాల వరకు విస్తరించి ఉంది. హెచ్బి కాలనీ, మద్దిలపాలెం వంటి నగరంలోని ప్రధాన మరియు అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల్లో 456 నివాసయోగ్యమైన ఎంఐజి/ఎల్ఐజి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాలు 24 నుండి 60 అడుగుల విశాలమైన కాంక్రీట్ రోడ్లు కలిగి ఉండి, జాతీయ రహదారి 16 (NH-16)కి అత్యంత సమీపంలో ఉన్నాయి. అలాగే ఆటో నగర్, గాజువాక పరిధిలోని బ్లాక్ 2లో వాణిజ్య, లాజిస్టిక్స్ అవసరాలకు అనువైన 2,728 చదరపు గజాల స్థలంతో పాటు, బ్లాక్ 3లో రెండు నివాస ప్లాట్లను వేలంలో ఉంచారు.
ఈ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అక్టోబర్ 12 మరియు అక్టోబర్ 16 తేదీలలో రైల్టెల్ ఇ-నివిడా ఇ-ప్రొక్యూర్మెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్పై పారదర్శకంగా నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తిగల బిడ్డర్లు నిర్ణీత గడువులోగా 'eauction.enivida.com' పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, కేవైసీ పరిశీలన పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పోటీదారులు ప్రతి ప్లాట్కు రూ. 2 లక్షలను ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) రూపంలో సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములు మరియు అనుబంధ ఆస్తులను క్రమబద్ధమైన విధానంలో నగదుగా మార్చే ఎన్ఎల్ఎంసీ లక్ష్యంలో భాగంగా ఈ ఇ-వేలం నిర్వహించబడుతోంది.