
Vjy, Feb 17: వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఏపీలో మరో వైసీపీ నేత త్వరలో జైలుకు వెళ్తారని టీడీపీ మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ (Perni Nani Will Be Arrested Soon) ఆలస్యమయిందని మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ అన్నారు. త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ అవుతారని చెప్పారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని పత్తాలేకుండా పోయారని రవీంద్ర, సుభాష్ ఎద్దేవా చేశారు. చేసిన అరాచకాలకు, అకృత్యాలకు మూల్యం చెల్లించేందుకు కొడాలి నాని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడిన నేతలను ఏమీ చేయడం లేదన్న ఆగ్రహం కూటమి నేతలు, కార్యకర్తల్లో ఉందని... వల్లభనేని వంశీ అరెస్ట్ తో కూటమి శ్రేణుల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. కర్మఫలం ఎవరినీ వదలదని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు.