Tollywood Drug Scandal Row: టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మంత్రి కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ సిటీ కోర్టు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మంత్రి కేటీఆర్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఆదేశించింది. రేవంత్పై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై మంగళవారం విచారణ జరిపిన అనంతరం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad, Sep 22: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మంత్రి కేటీఆర్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఆదేశించింది. రేవంత్పై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై మంగళవారం విచారణ జరిపిన అనంతరం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసుతో (Tollywood Drug Scandal) తన పేరును ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠకు రేవంత్రెడ్డి (TPCC Chief Revanth Reddy) భంగం కలిగించారంటూ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి కె. కల్యాణ్ చక్రవర్తి విచారణ జరిపారు.
సోమవారమే కేటీఆర్ (Minister KTR) ఈ పిటిషన్ను దాఖలు చేయగా సరైన ఆధారాలు లేవంటూ కోర్టు (Hyderabad Court) విచారణకు స్వీకరించని విషయం తెలిసిందే. దీంతో మంగళవారం పూర్తి ఆధారాలను కేటీఆర్ సమర్పించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. తన క్లయింట్పై రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు. పత్రికలు, టీవీలతోపాటు ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దాంతోపాటు ఆయా సామాజిక మాధ్యమాల నుంచి కేటీఆర్ పేరును తొలగించేలా రేవంత్ను ఆదేశించాలని కోరారు.
ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. మంత్రి సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈడీ డ్రగ్స్ కేసు విచారణతో ముడిపెట్టి మంత్రి కేటీఆర్పై వ్యాఖ్యలు చేయవద్దని (Dont link Minister KTR with Tollywood Drug Scandal) రేవంత్రెడ్డికి ఇంజక్షన్ ఉత్తర్వులు ఇస్తూ ఆదేశాలిచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియాల్లో కూడా ఈడీ డ్రగ్స్కు సంబంధించిన కేసులో కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని రేవంత్రెడ్డికి సూచించింది. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది.
(The above story first appeared on LatestLY on Sep 22, 2021 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

