Hyderabad Stabbing Incident: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య , 10 నిమిషాలు వెంటాడి దాడి చేసిన ప్రత్యర్థి, శాంతిభద్రతలపై నగరవాసుల ఆందోళన
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో బుధవారం సాయంత్రం రౌడీషీటర్ హత్య జరిగిన ఘటన కలకలం రేపింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం, రంగారెడ్డినగర్కు చెందిన రోషన్సింగ్ (25) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనిపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది.జగద్గిరిగుట్టకు చెందిన బాలశౌరిరెడ్డి (26) కూడా రౌడీషీటర్. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి కొంతకాలం పాటు కలిసి తిరిగేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్థిక లావాదేవీలు, ఒక మహిళ విషయంలో ఏర్పడిన విభేదాలు వారిద్దరి మధ్య దూరాన్ని పెంచాయి.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోషన్సింగ్ తన స్నేహితుడు మనోహర్తో కలిసి జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద ఉన్నాడు. అదే సమయంలో బాలశౌరిరెడ్డి, తన స్నేహితులు ఆదిల్, మహ్మద్లతో కలిసి బుల్లెట్ బైక్పై అక్కడికి చేరుకున్నాడు. తగాదా ముదిరడంతో బాలశౌరి బృందం రోషన్సింగ్పై దాడి చేసింది. వారిలో ఒకరు రోషన్సింగ్ను పట్టుకోగా, బాలశౌరి కత్తితో విచక్షణ రహితంగా పలుసార్లు పొడిచాడు. భయంతో మనోహర్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. రోషన్సింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించినా బాలశౌరి వెంటాడి మళ్లీ పొడిచాడు. ఆపై తన స్నేహితులతో కలిసి బైక్పై అక్కడి నుంచి పారిపోయాడు.
Hyderabad Stabbing Incident:
నడిరోడ్డుపై దాదాపు పది నిమిషాలపాటు ఈ దాడి కొనసాగినా పోలీసులు అక్కడికి రాకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పెట్రోలింగ్, గస్తీలు తగ్గిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రోషన్సింగ్ను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన స్థలాన్ని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ నరేశ్రెడ్డి పరిశీలించారు. నిందితుడు బాలశౌరిరెడ్డి, అతని సహచరుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ప్రారంభించాయి. పోలీసులు హత్య వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత విభేదాలను ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రాంతంలో అదనపు పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.