Lakshmi Narasimha Swamy Brahmotsavams: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి.
Hyd, Mar 1: నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు(Lakshmi Narasimha Swamy Brahmotsavams) ప్రారంభంకానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండపైకి వాహనాలను ఉచితంగా అనుమతించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
ఇటీవలె ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో జరుగుతున్న(Yadagiri Gutta) తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ స్వస్తివాచనం, అంకురారోపణం జరగనుండగా ఆదివారం నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేదపారాయణ, హవన, అలంకార సేవలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఇక 7న ఎదుర్కోలు, 8న లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 11న శతఘటాభిషేకం, శృంగారడోలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.
Yadagiri Gutta Sri Lakshmi Narasimha Swamy Annual Brahmotsavams Begins Today
ఈ నెల 8న తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్వామివారిని దర్శించుకొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీగా భక్తులు తరలిరానున్నారు.