Apple కొత్త CEOగా జాన్ టెర్నస్.. 25 ఏళ్ల Apple ప్రయాణం నుంచి CEO పదవి వరకు.. John Ternus సక్సెస్ స్టోరీ..
ప్రపంచ టెక్ దిగ్గజం 'యాపిల్' సంస్థలో చారిత్రాత్మక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయవంతంగా నడిపించిన సీఈవో టిమ్ కుక్ బాధ్యతల నుంచి తప్పుకోగా, ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు
ప్రపంచ టెక్ దిగ్గజం 'యాపిల్' సంస్థలో చారిత్రాత్మక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయవంతంగా నడిపించిన సీఈవో టిమ్ కుక్ బాధ్యతల నుంచి తప్పుకోగా, ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. యాపిల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2026 సెప్టెంబర్ 1 నుంచే ఈ మార్పు అమలులోకి రాగా, ఇకపై టిమ్ కుక్ సంస్థ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. 51 ఏళ్ల టెర్నస్ యాపిల్ చరిత్రలోనే ఎనిమిదో సీఈవోగా ఎంపికయ్యారు.
యాపిల్లో 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న టెర్నస్ 2001లో కంపెనీలో చేరారు. మొదట ప్రొడక్ట్ డిజైన్ బృందంలో పనిచేసి, 2021 నాటికి హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ఈ హోదాలో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్, విజన్ ప్రో వంటి విప్లవాత్మక ఉత్పత్తుల హార్డ్వేర్ అభివృద్ధికి ఆయన పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. కంపెనీ సంస్కృతి, సరఫరా వ్యవస్థలపై లోతైన అవగాహన ఉండటంతోనే బోర్డు టెర్నస్కు ఈ అత్యున్నత బాధ్యతలను అప్పగించింది. సీఈవోగా ఆయనకు వార్షిక జీతం 3 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.28.47 కోట్లు) పాటు పనితీరు ఆధారితంగా 55 మిలియన్ డాలర్ల (సుమారు రూ.522.25 కోట్లు) విలువైన స్టాక్ అవార్డులు దక్కనున్నాయి.
అదే సమయంలో 2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టి, కంపెనీ మార్కెట్ విలువను సుమారు 4.5–4.6 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన టిమ్ కుక్, ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అంతర్జాతీయ విధాన నిర్ణేతలతో సంబంధాలు మరియు కీలక వ్యూహాత్మక వ్యవహారాల్లో మార్గనిర్దేశం చేయనున్నారు. టెర్నస్లో ఇంజినీర్ ఆలోచనా విధానం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కుక్ కొనియాడారు. కాగా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఏఐ (AI) రంగంలో దూసుకెళ్తున్న వేళ, యాపిల్ కృత్రిమ మేధ వ్యూహాలను బలోపేతం చేయడం, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి కీలక సవాళ్లు నూతన సీఈవో టెర్నస్ ముందు నిలవనున్నాయి.