Israel-Hamas War: ఏడో రోజుకు చేరుకున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాపై ఇప్పటివరకూ 6 వేల బాంబులు కురిపించిన ఇజ్రాయెల్.. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేడు ఏడో రోజుకు చేరుకుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ లో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,300కు పెరిగింది.
Newdelhi, Oct 13: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య జరుగుతున్న యుద్ధం నేడు ఏడో రోజుకు చేరుకుంది. హమాస్ ఉగ్రవాదుల (Hamas Militants) దాడిలో ఇజ్రాయెల్ (Israel) లో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,300కు పెరిగింది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 1,500 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇరువైపులా మరణించిన వారి సంఖ్య 2,800కు చేరింది. యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్దమైన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సరిహద్దుకు ట్యాంకులు, ఇతర సైనిక సంపత్తిని తరలిస్తోంది. గాజాపై ఇప్పటివరకూ నాలుగు వేల టన్నుల బరువు పేలుడు పదార్థాలు ఉన్న 6 వేల బాంబులు కురిపించినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇండియా ‘ఆపరేషన్ అజయ్’
ఇరు దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా చార్టర్ విమానాలను సిద్ధం చేస్తోంది. ఇండియా కూడా తమ పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది.