Scissors in Abdomen: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ కడుపులో 12 ఏళ్లుగా రెండు కత్తెరలు.. సిక్కింలో దారుణం
ఓ వైద్యుడి నిర్లక్ష్య వైఖరితో ఓ మహిళ కడుపునొప్పితో పుష్కరకాలంపాటు తీవ్ర ఇబ్బంది పడింది. శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలను పొరపాటున మహిళ పొత్తి కడుపులో ఉంచి కుట్లు వేయడమే దీనికి కారణంగా తెలుస్తుంది.
Newdelhi, Oct 20: ఓ వైద్యుడి నిర్లక్ష్య వైఖరితో ఓ మహిళ కడుపు నొప్పితో పుష్కరకాలంపాటు తీవ్ర ఇబ్బంది పడింది. శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలను (scissors) పొరపాటున మహిళ పొత్తి కడుపులో ఉంచి కుట్లు వేయడమే దీనికి కారణంగా తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిక్కిం (Sikkim) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్ టక్ లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ శస్త్ర చికిత్స చేయించుకుంది. అప్పటి నుండి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. ఎన్ని దవాఖానలను ఆశ్రయించినా.. ఏ వైద్యుడూ నొప్పికి గల కారణాలను చెప్ప లేకపోయారు. అయితే ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్ రే తీయించగా, అసలు విషయం బయటపడింది.
ఎక్స్ రేలో ఏం తేలింది?
బాధితురాలి పొత్తి కడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్లు ఎక్స్ రేలో గుర్తించారు. దీంతో వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆ రెండు కత్తెరలను తొలగించారు.