IMD Weather Update: వర్షాకాలానికి ఇక బ్రేక్.. సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాలు వెనక్కి.. IMD కీలక అప్డేట్
దేశంలో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభానికి సమయం ఆసన్నమైందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ నుంచి పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి సరైన పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
IMD Weather Update: దేశంలో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభానికి సమయం ఆసన్నమైందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ నుంచి పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి సరైన పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ఏటా సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ, ఈ ఏడాది రెండు రోజుల వ్యవధి ఆలస్యంగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది.
పశ్చిమ రాజస్థాన్లో ఉపసంహరణ షురూ అయినప్పటికీ.. మధ్య, తూర్పు, మరియు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 21 వరకు విస్తారంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్ 18 నుండి 20వ తేదీల మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
కాగా, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. సెప్టెంబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది, అక్కడ సాధారణం కంటే 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 43 శాతం వర్షపాత లోటు ఉండగా, కర్ణాటకలో 29 శాతం, కేరళలో 27 శాతం చొప్పున లోటు నమోదైందని ఐఎండీ నివేదిక వెల్లడించింది.