Bihar Shocker: ఇంత అమానవీయమా! యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేసిన పోలీసులు, అత్యంత హేయమైన చర్య అంటూ నెటిజన్ల ఫైర్
రక్తం మడుగుల్లో రోడ్డుపై మృతదేహం పడి ఉండటం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని పట్టుకుని వంతెన పైనుంచి కింద ఉన్న కాలువలోకి పడేశారు.
Patna, OCT 08: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేశారు. (Bihar cops dumps body into canal) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. రక్తం మడుగుల్లో రోడ్డుపై మృతదేహం పడి ఉండటం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని పట్టుకుని వంతెన పైనుంచి కింద ఉన్న కాలువలోకి పడేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇది చూసి షాక్ అయ్యారు. మరి కొందరు తమ మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. కాలువలో పడేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం అవశేషాలు మాత్రమే కాలువలో పడేసినట్టుగా సమర్థించుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరోవైపు ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.