Independence Day 2021: రూ.100 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్, పీఎం గతిశక్తి ప్రణాళికను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపిన ప్రధాని, భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన పీఎం నరేంద్ర మోదీ
Narendra Modi (Photo Credits: ANI)

PM Narendra Modi Speech Highlights: ఎర్రకోటలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి (PM Narendra Modi Speech Highlights) ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు.

దేశాన్ని మహమ్మారి చుట్టుముట్టినప్పుడు టీకాల అభ్యత, భారత ప్రజలకు టీకాలు దొరుకుతాయా? అనుమానం తలెత్తిందని ప్రధాని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందన్నారు. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి సంక్రమణ తక్కువేనన్నారు. అయితే, సంక్రమణ తక్కువనేది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదన్నారు.

మహమ్మారి కట్టడికి క్రమశిక్షణతో కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన జీవన శైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంత వరకు రక్షించాయని చెప్పారు. భారతీయులు ఈ యుద్ధంలో (కోవిడ్) చాలా సహనంతో పోరాడారని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల ఫలితంగా నేడు భారతదేశం టీకాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. కొవిన్‌ యాప్‌ ప్రపంచం దృష్టి ఆకర్షించిందన్నారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవం, భారతదేశ సంప్రదాయ నృత్యాలతో గూగుల్ డూడుల్, దేశ వ్యాప్తంగా మిన్నంటిన భారత స్వాతంత్ర్య దినోత్సవం 2021 వేడుకలు

టోక్యో ఒలిపింక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు నవ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని మోదీ అన్నారు. భారత అథ్లెట్లు నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌.. మన రణనినాదం కావాలి.

వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని’’ ప్రధాని మోదీ అన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలన్నారు. 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య 25 ఏళ్లకాలం అమృత ఘడియలని, అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలని చెప్పారు.

కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదని.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే సాకారం అవుతుందన్నారు. ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగు కీలకమేనని, ఒక్క క్షణం వృథా చేయకుండా ప్రతి పౌరుడు సంకల్ప శక్తితో ముందుకు నడవాలన్నారు. సమస్త పౌరుల భాగస్వామ్యంతో సమృద్ధ భారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అన్ని లక్ష్యాల సాధనకు సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌.. సబ్‌కా ప్రయాస్‌ చాలా ముఖ్యమన్నారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం

దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేసిన పోరాటం అసమానమన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అన్నారు. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తు వారికి గౌరవం ప్రకటిస్తోందన్నారు. వాళ్లు పతకాలు మాత్రమే సాధించలేదు.. నవ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఒలింపిక్‌ పతక విజేతలను చప్పట్లు కొట్టి ప్రత్యేకంగా అభినందించారు.

ఆగ‌స్టు 14వ తేదీ ఇకనుంచి విభజన గాయాల స్మారక దినం, భయానక విభజన గాయాలు గుర్తు చేసుకునే రోజుగా ఈ తేదీని జరుపుకోవాలని ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ

సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి. పోషకాహారంతోపాటు వైద్యం కూడా అత్యంత కీలకమైంది. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రికి వైద్య వసతులతోపాటు ఆక్సిజన్‌ ప్లాంటుకు చర్యలు తీసుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్యుల సంఖ్యను పెంచేందుకు వైద్యవిద్యలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ఓబీసీల్లో ఎవరు ఉండాలనే దానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చాం. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా చూడాలి. చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఉందని’’ ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ వికాసానికి చర్యలు చేపట్టామని మోదీ అన్నారు. లద్ధాఖ్‌లో సింధూ సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌నెట్‌ను గ్రామస్థాయికి అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు,ఈ కోట్స్‌తో మీ బంధుమిత్రులకి, స్నేహితులకి విషెస్ చెప్పండి, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..

‘ఫసల్‌ బీమా యోజనతో చిన్న రైతులకు మేలు జరుగుతోంది. కిసాన్‌ రైల్‌తో చిన్నకారు రైతులకు మేలు జరుగుతోంది. ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధానిని రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తాం. 25 ఏళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలి. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. లద్దాఖ్‌ అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. ఆన్‌లైన్ ద్వారా మన ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తున్నాం.

డిజిటల్‌ విప్లవంతో ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు అవసరం. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోంది. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల లోపు భూమి కలిగినవారే. చిన్న, సన్నకారు రైతులు దేశానికి గర్వకారణం అయ్యేలా పథకాలు ఉండాలి. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలి. దేశంలో కొత్త సంపద సృష్టికర్తల తరం ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలతో నవీన పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారని’’ ప్రధాని మోదీ అన్నారు.

రాబోయే రోజుల్లో పీఎం గతిశక్తి ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.100లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్‌ ప్లాన్‌ అనీ, ఇది సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పనకు పునాది వేస్తుందని, ఆర్థిక వ్యవస్థకు సమగ్ర బాటలు అందిస్తుందని చెప్పారు. గతి శక్తి స్థానిక తయారీదారులకు ప్రపంచంతో పోటీపడేందుకు సహాయపడుతుందన్నారు. కొత్త భవిష్యత్‌ ఎకనామిక్‌ జోన్స్‌ అవకాశాలను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. రూ.100లక్షల కోట్ల గత శక్తి చొరవ యువతకు ఉపాధి అవకాశాలను తెస్తుందని, సంపూర్ణ మౌలిక సదుపాయాల వృద్ధికి సహాయపడుతుందన్నారు.

భారతదేశం ఏడు సంవత్సరాల క్రితం 8 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్‌లను దిగుమతి చేసుకుందని, ఇప్పుడు మూడు బిలియన్‌ డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తుందని ప్రధాని తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు, మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారతదేశం సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అత్యాధునిక ఆవిష్కరణలు, కొత్త తరం టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీ కోసం మనం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.

ఏడేళ్లలో ఉజ్వల నుంచి ఆయుష్మాన్‌ వరకు అనేక పథకాలు కోట్ల మంది ప్రజల ముంగిట చేరాయన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సంతృప్త స్థాయికి తీసుకెళ్లాయని, సంక్షేమ, అభివృద్ధి పథకాల హక్కుదారులకు వందశాతం చేరేలా చేయాలన్నారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరినీ బ్యాంకులతో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ఇంటింటికీ విద్యుత్‌, తాగునీరు ఇంకా సుదూర స్వప్నం కాకూడదన్నారు. ప్రతి ఇంటికీ కరెంటు, తాగునీరు అందించడం మనందరి బాధ్యత అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి వివక్షకు తావుండకూడదన్నారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని, ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందాలన్నారు.

దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతోందని ప్రధాని అన్నారు. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయన్నారు. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయన్నారు. విభజన సమయంలో భారతదేశ ప్రజలు ఎదుర్కొన్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్‌ 14 విభజన భయానక జ్ఞాపకాల దినంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.