Goa Politics: డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్యలకు పాల్పడుతోంది, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ
గోవాలో మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరామని మైఖేల్ లోబో వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరడంతో గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 3కు పడిపోయింది.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దిలియ లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సి సెక్విర, రుడోల్ఫ్ ఫెర్నాండెజ్లు బీజేపీలో చేరారు.
ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. హస్తం పార్టీ సీనియర్ నేతలు కమలం పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యను ఆపరేషన్ కీచఢ్(బురద)గా అభివర్ణించారు. డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం చూసి బీజేపీ ఆపరేషన్ కీచఢ్(బురద)ను వేగవంతం చేసింది. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి కమలం పార్టీ నిరాశ చెందుతోంది.
Here's Tweet
యాత్రను తక్కువ చేసి చూపేందుకు రోజూ ప్రజల దృష్టి మళ్లించే పనులు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. మేం నిరాడంబరంగానే ఉంటాం. బీజేపీ డర్టీ ట్రిక్స్ను అధిగమిస్తాం' అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
కాగా 40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019లోనూ ఇదే తరహాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.