Barber Violence: సగం గడ్డం గీశాక డబ్బులు అడిగిన క్షురకుడు.. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తాననడంతో గొడవ.. ఇద్దరి హత్య

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘటన.. బాధితుడి గొంతు కోసి చంపేసిన క్షురకుడు.. ఆగ్రహంతో సెలూన్‌ను తగలబెట్టిన యువకుడి బంధువులు.. క్షురకుడిని పట్టుకుని కొట్టి చంపిన వైనం

Shaving (Image Credits: Google)

Aurangabad, September 17: ఓ సెలూన్‌లో డబ్బుల కోసం మొదలైన చిన్నపాటి గొడవ రెండు హత్యలకు దారితీసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని బోధి గ్రామంలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్ సురేశ్ దేవ్‌కర్ అనే 22 ఏళ్ల యువకుడు షేవింగ్ కోసం అనిల్ మారుతి షిండే సెలూన్‌‌కు వచ్చాడు. సగం షేవింగ్ అయ్యాక వెంకట్‌ను అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తానని వెంకట్ బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది మరింత ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ దుకాణంలోని పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు గోశాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు.

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికం భవనం.. వీడియో ఇదిగో!

విషయం తెలిసిన అతడి బంధువులు సెలూన్ వద్దకు చేరుకుని దానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత పరారీలో ఉన్న అనిల్‌ను వెతికి పట్టుకుని కొట్టి చంపారు. అతడి ఇంటిని కూడా తగలబెట్టారు. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement