Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు
మాజీ సీఎం జగన్ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు
Vjy, Feb 19: మాజీ సీఎం జగన్ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు. జగన్ మిర్చియార్డు వద్ద పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎవరైనా నవ్వుకుంటున్నారన్న స్పృహ కూడా లేదు. గుంటూరు మిర్చి యార్డు ఇప్పుడు కొత్తగా రాలేదు.. గతంలోనూ ఉంది. జగన్ సొంత మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో మిర్చి పంట పండుతోంది. ధర రూ.13వేలకు పడిపోయిందని జగన్ అంటున్నారు.
గత పదేళ్లలో మిర్చి ధరలు పరిశీలిస్తే.. అత్యధికంగా రూ.13వేలు ధర ఉంది. రెండేళ్లు మాత్రమే మిర్చి రైతులకు రూ.20వేలు ధర పలికింది. మిర్చి రైతులకు ఇబ్బందులున్న మాట వాస్తవం.. సాగు ఖర్చులు పెరిగాయి. పని లేకపోవడంతోనే జగన్ అనవసర విమర్శలు చేస్తున్నారు. ఐదేళ్లూ నాటకాలాడి ఇప్పుడేమో ప్రేమ ఒలకబోస్తున్నారు. జగన్ పాలనలో వ్యవసాయశాఖను పట్టించుకున్న పాపానపోలేదు.
ఆదాయం తెచ్చే శాఖలకు జగన్ తాళం వేసి బిగించారు. ఇప్పుడు ఆయన వాటి గురించి మాట్లాడుతున్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ రైతుల కోసం ఒక్క మంచి పని చూడా చేయలేదు. సెంటు భూమికి కూడా భూపరీక్షలు చేయించలేదు. వ్యవసాయశాఖను అటకపై పెట్టారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు. తాను పుట్టిన రాయలసీమలోనూ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు.
జగన్ రైతులకు పెట్టిన రూ.1600 కోట్ల బకాయిలను మేం వచ్చాక చెల్లించాం. టమాటా ధర తగ్గితే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేశాం. ఈ 8 నెలల్లో ఎరువులు బఫర్ స్టాక్ పెట్టాం. ప్రకృతి విపత్తుల సమయంలో జగన్ ఏనాడూ పైసా ఇవ్వలేదు. మేం వెంటనే పరిహారం చెల్లించాం. రైతులకు మేలు చేయాలనేదే కూటమి ప్రభుత్వం ఆలోచన’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.