Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి
చంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు అని మండిపడ్డారు.
Vjy, Jan 30: చంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారు. మరి ఆ సొమ్మును ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబును (Ramachandra Reddy Slams Chandrababu Govt) డిమాండ్ చేశారు.
గురువారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ అన్నారు...ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చాను అన్నారు. ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లడడం లేదు. హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా? వైఎస్ జగన్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు.. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులు అని విమర్శించారు.
ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఇచ్చారు..? దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ కోవిడ్-19 సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. హామీ ఇచ్చిన తేదీ ప్రకారం సంక్షేమాన్ని అందించారు. ఆ సంక్షేమం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు ఏపీకి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారన్నారు.
కానీ చంద్రబాబు అలా కాదు. సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉన్నా.. డబ్బులు లేవని దాట వేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యం లేదు. అధికారంలోకి వచ్చారు. ఆరోగ్య శ్రీతో పాటు, రాష్ట్రంలోని వైద్య విద్యను నిర్విర్యం చేశారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా..? ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆనాడు చంద్రబాబుకి వంత పాడారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.