ISRO GSAT-20: ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-20 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఎందుకోసం అంటే?
ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జీశాట్-20 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.
Newdelhi, Nov 19: ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’ (Space X)కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జీశాట్-20 (ISRO GSAT-20) ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయోగం చేపట్టారు. ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య మొదటి భాగస్వామ్యం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అధునాతన కా-బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో ఇస్రో రూపొందించిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం.
ఉపయోగాలు ఏమిటి?
జీశాట్ 20 ఉపగ్రహాన్ని జీశాట్ ఎన్-2 అని కూడా పిలుస్తారు. ఏకంగా 4,700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించినది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను అందించవచ్చు. అంతేకాదు విమానాల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు. విమానాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించవచ్చు.
స్పేస్ ఎక్స్ తో ఎందుకు?
4,700 కిలోల బరువున్న పేలోడ్ ను ప్రయోగించగల రాకెట్ లు ఇస్రో వద్ద లేవు. దీంతో జీశాట్-20 ప్రయోగం కోసం స్పేస్ ఎక్స్ తో ఇస్రో భాగస్వామ్యం కుదుర్చుకుంది.